మొన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, "అనంతరామా , నా గుర్తుగా నీకో బహుమతి ఇస్తున్నా, జాగ్రత్తగా నీ దగ్గరే ఈ బహుమతిని ఉంచుకో" అని చెప్పి, నా చేతిలో అందంగా, రంగు కాగితాలతో అలంకరించిన బహుమతి ఒకటి పెట్టింది. కకృత్తిగా కాకుండా, మెల్లగా తీసి చూస్తే, అందులో ఒక అందమైన బూడిద చిప్ప (యాష్ ట్రే) ఉంది. "ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ బూడిద చిప్ప ఎందుకు తెచ్చావ్??" అని అడిగితే, "నువ్వు చుట్ట, బీడీ కాల్చి ఇందులో బూడిద తడుతుంటే, నేను గుర్తుకు వచ్చి, నువ్వు అవి కాల్చటం ఆపేయాలి" అని అన్నది. అస్సలు నాకు అవి కాల్చే అలవాటే లేదని చెప్పాను. దానికి తను, "నేను ప్రేమతో బహుమతి కొంటే, అలవాటు లేదంటావా?? వారం రోజుల్లో అలవాటు చేసుకుని మరీ మానేయాలి" అని చెప్పింది. ఈ మధ్య చిత్రాలు చూసి అమ్మాయిలు చెడిపోతున్నారు అనుకోండి(నేను ఖుషి చిత్రం చూడలేదు., నమ్మండి).
ధూమపానం అంటే గుర్తొచ్చింది., అమ్మానాన్నలు రోజుకి వంద సార్లు చెప్పినా విననోడు., ప్రేమించే అమ్మాయికి ఇష్టం లేదని, తనకి ఆ పొగ వల్ల దగ్గు వచ్చిందని, క్షణంలో ధూమపానం మానేస్తాడు., అది ప్రేమకు ఉన్న శక్తీ, బలం, బొంగు, భోషాణం. అస్సలు వీళ్ళందరి చేతా రామాయణం చదివించాలి. తండ్రి మాటకు కట్టుబడి అరణ్యాలకి వెళ్ళిన రాముని కధ విని కనీసం అప్పుడప్పుడన్నాఅమ్మానాన్నలు చెప్పిన మాట వింటారేమో. అస్సలు రామాయణం చదివినా, విన్నా, మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. అయినా ఈ రోజుల్లో అలా ఎవరు ఉండగలరు? ఉదాహరణకు, రామాయణం మనకు ఏమని చెప్తుంది? ధర్మం కోసం, భార్యనైన వదిలేయమని చెప్పింది. కాని, ఈ రోజుల్లో భార్య కోసం ధర్మాన్ని వదిలేస్తున్నారు. భార్య కోసం కాదు కాదు, బలపం కోసం కూడా ధర్మాన్ని తప్పుతున్నాము.
ఇదే విషయాన్ని మొన్న శ్రీరామరాజ్యం చిత్రంలో బాలయ్య బాబు చెప్పాడు. కానీ ఎంత మంది ఆ చిత్రాన్ని చూశారు? అదే వందమందిని నరకటం, అరడజను అశ్లీల పాటలు ఉంటే మాత్రం, ఒకటికి నాలుగు సార్లు చూస్తారు, ఇంకో నలుగురిని చూడమని చెప్తారు. నిన్న, ఒకానొక సందర్భంలో బాలయ్యబాబు కూడా అదే చెప్పాడు, యువత శ్రీరామా రాజ్యం చిత్రం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని. అస్సలు రామాయణం మనకున్న గొప్ప సంపద. రాయాలంటే శీర్షికలు చాలవు, తీయాలంటే చిత్రాలు చాలవు. రామాయణం మీద శీర్షికలు రాయాలనే ఉంది కానీ., అంత వయసు, పరిజ్ఞానం లేదని రాయటంలేదు. అయినా రామాయణం గురించి రాస్తే, ఇవాళ రేపు ఎవరు చదువుతున్నారు?
రామాయణం గురించి తర్వాత చెప్తాను, దూమపానం చేసిన వాళ్ళని చూస్తే, నాకు ఎప్పుడూ ఒకటే గుర్తొస్తుంది. వెలిగించిన చుట్ట, బీడీ, ఇవన్ని మన జీవితంలో చేసే తప్పులు లాంటివి. పొగ లోనికి పీల్చి, దర్జాగా బయటికి గిర్రు గిర్రున వదులుతారు. కాని చివరికి మిగిలేది, బయట బూడిద, లోపల జబ్బు. అలానే జీవితంలో తప్పు చేసేప్పుడు దర్జాగానే ఉంటుంది., కాని చివరికి మిగిలేది ఎమీ ఉండదు, బూడిద తప్ప. నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో వెంకటేష్ బాబు "దూమపానం చేస్తే దగ్గు వస్తుంది తప్ప బలం రాదు" అని చెప్తే ఎంత మంది విన్నారు? చివరగా ఈ రామానంద స్వామి ఏమంటాడంటే, ధూమపానం, అగరబత్తి రెండిటి నుంచి వచ్చేది పోగే, రెండూ మనల్ని దేవుడి దగ్గరకి చేర్చేవే, అగరబత్తిని నమ్ముకుంటే అరవైకి కానీ పోలేరు., ధూమపానాన్ని నమ్ముకొని ముప్పైకే దేవుడి దర్శనం దొరుకుతుంది. ప్రోగ తాగని వాడు దున్నపోతయి పుడతారు, అన్న సామెతని నమ్మి, ధూమపానం చేయండి, దేవుడిని శీఘ్రంగా దర్శించుకోండి.