Sunday, January 20, 2013

తెగులు వచ్చిన 'నాయక్' తెలుగు పాటలు

గత నెలలో జరిగిన ప్రపంచ మహా సభలు ఘనంగా ముగిశాయి. ముఖం పుస్తకంలో కూడా దాని గురించి అంతా మర్చిపోయారు. ఆ మహాసభలలో చిరంజీవిగారు చాలా చక్కగా మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ, " తెలుగు బాష ఇలాంటి సభల వరకే పరిమితం అవుతున్నది అని ఎన్నో సార్లు నాకు భాదగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి సభలు జరగటం అన్నది మనం స్పూర్తిగా తీసుకోవాలి. తెలుగుని మన భావి తరాలకి ఆస్తిగా అందివ్వాలి " అని చాలా చక్కగా అచ్చ తెలుగులో చెప్పారు.  నమ్మకం కలగకపోతే  యుట్యూబ్ లో వెతికి చూడండి. ఆ మాటలకు, తెలుగుకి ఇంక తెగులు ఉండదు అన్న నమ్మకం కలిగింది.

" రామ్ చరణ్ కొత్త సినిమా 'నాయక్' పాటలు విన్నావారా? చాలా బాగున్నాయి" అని 'నా' సామాజిక వర్గానికి చెందిన నా స్నేహితుడొకడు చెప్పటంతో వాటిని విన్నాను.

 "హేయ్ నాయక  తూ హే లవ్ నాయాక్, తుజ్ సే దిల్ డోలక్, దన్ దనాదన్ తీన్ మారే" అని మొదటి పాట మొదటి వాఖ్యం విని, అప్పుడెప్పుడో రామ్ చరణ్ హిందీ సినిమా తీస్తున్నాడని వార్తల్లో వచ్చింది. బహుశా ఆ సినిమానే 'నాయాక్' కాబోలు అనుకున్నాను. 'నాయక్' అనే పేరు కుడా హిందీ పేరులాగానే తోచింది. కాని ఆ తరువాత ఆ పాటలో రెండు మూడు తెలుగు పదాలు తగిలేసరికి అనుమానం వచ్చింది. ఇది తెలుగు సినిమానా? హిందీ సినిమానా అని.

రెండో పాటకు వచ్చాను. "లైలా ఓ లైలా ఆ జారే లైలా, ఆజా ఓ మేరీ లాలా. దీవానా మై దీవానా" అని నా అనుమానాన్ని రెట్టింపు చేసింది. కానీ ఈ పాటలో కుడా మళ్ళీ తెలుగు పదాలు తగిలే సరికి ఇది తెలుగు సినిమానే అని నిర్ధారణకు వచ్చాను.  ఈ పాట మొత్తం నాలుగు హిందీ మాటలు, ఒక తెలుగు పదం, మధ్య మధ్యలో ఆంగ్ల పదాలతోనే సాగింది.

మూడో పాట, మొదలు పెడుతూనే ఆంగ్లమో "ఓ మై డాగ్, ఫీల్ ద వే" అని ఏదో వినపడింది. ఆ తరువాత "కత్తి లాంటి పిల్లా  కస్సు  మెరుపులా" అని తెలుగులోకి వెళ్లి, మరలా "మేడమ్ మేడమ్ మేడమ్, జస్ట్ బీ మై బీ మై మేడమ్" అని ఆంగ్లంలో కాసేపు వాయించి అవతలేశాడు.

ఇంక నాలుగో పాట.., పాట విన్న ఒకే ఒక్క క్షణంలో అర్ధం అయిపొయింది, ఆ పాట కొండవీటి దొంగలో "శుభలేఖ రాసుకున్నా" అని. కొంపతీసి ఈ పాటను కూడా "శుభలేఖ లిఖేంగే హిందీ మే హమ్ " అని మార్చి రాశారేమో  అని భయమేసింది. దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు. పాట మొత్తం డబ్బాలో రాళ్ళు వేసి కొట్టినట్లు ఉన్నది తప్ప, పాత పాట అంత హాయిగా లేదు. పైగా బాలుగారి గొంతుతో పాటని వందల సార్లు విని, ఇప్పుడు వేరెవరో పాడితే జీర్ణించుకోవటానికి చాలా సమయమే పడుతుంది. ఈ పాట మర్చిపోవటానికి, పాత పాట ఒక వంద సార్లు వినాల్సి వచ్చింది. కానీ సినిమా చూశాక పాట తీసిన విదానం నచ్చింది. రామ్ చరణ్ ప్రతి దృశ్యం లో వాళ్ళ నాన్నని తలపించాడు.

"ఒక చూపుకి పడిపోయా" అనే పాట కూడా "దిల్ దియా", "దే దియా", "లగా దియా","చురాలియా", "మార్ దియా", "క్యా కియా" అని హిందీలో ప్రాసతో కాసేపు, అర్ధం కాని అమెరికా ఆంగ్లంతో ఇంకాసేపు, అస్సలు ఏ భాషో కూడా అర్ధం కానీ బాషలో ఇంకాసేపు సాగిపోయింది. తమన్ వచ్చాక, అస్సలు మన దేశంలో ఆ మాటకొస్తే మన ఖండంలో లేని భాషలు కూడా తెలుగు పాటల్లోకి వచ్చాయి. ఇక ఆఖరి పాట, " మై లడీ లడీ హౌరాకి , తు వడీ వడీ ఆంధ్రాకి" అని అచ్చ తెలుగులో రాసిన పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాట చరణాలకు అర్ధం చెప్పగలిగిన వాళ్ళకి, బహుశా ఙానపీఠ కన్నా పెద్దది ఇంకేదైనా ఉంటే,  అది ఇచ్చేయచ్చు.

ఈ చిత్రంతో పాటే విడుదల అయిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" పేరుకు తగ్గట్టే, పాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో. ఇదంతా చదివి నేనేదో 'క' సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నాను అనుకునేరు. నాకు ఇరు వర్గాలలోనూ స్నేహితులు ఉన్నారు. చివరకి నేను చెప్పదలచినది ఏంటంటే? "చిరంజీవి మాయ్యా!!! సినిమాల్లో, రాజకీయాల్లో సంపాదించి చెర్రికి ఇచ్చుంటారు. మీరు మొన్న తెలుగు మహా సభలో భావి తరాలకు ఆస్తి అని చెప్పినట్టు, తెలుగుని బావిలో పడేయకుండా, కాస్త భావి చిత్రాలలో తెలుగుని ఉంచమని మీ చెర్రీకి చెప్తారని ఆశిస్తున్నాను". చరణ్ హిందీ చిత్రం చేస్తున్నాడని తెలిసి చాలా సంతోషించాను. మన తెలుగువాడు, ఆ పైనొళ్ళ భాషలో, చిత్రాలు తీసి మంచి విజయం సాదించి, దేశం (తెలుగు దేశం కాదు) మొత్తం మీద మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.  

Wednesday, January 2, 2013

ఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటె కష్టం పొతుందా??


"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చక్కని తెలుగు పేరు కలిగిన చిత్రం. మరి ఆ చిత్రంలో తెలుగు ఎంతవరకు ఉంటుందో చూడాలి. పాటలు దాదాపు చక్కని తెలుగులో చక్కగా ఉన్నాయి. శ్రీరామచంద్ర ఇందులో మూడు పాటలు పాడాడు. అన్నీ పాటలు బాగున్నాయి. ముఖ్యంగా "మరీ అంతగా మహా చింతగా .." అనే పాట చాలా సార్లు విన్నాను. సీతారామశాస్త్రి గారు ఎంతో గొప్ప విషయాన్ని చాలా చక్కగా, అందరికీ అర్ధం అయ్యేలా రాశారు.
ఉదాహరణకు ఆ పాటలో
"కన్నీరై కురవాలా..మన చుట్టూ ఉండే లోకం తడిసేల
ముస్తాబే చెదరాలా..నిన్ను చుడాలంటె అద్దం జడిసేల"
కొంత మంది లోకం తడిసేలా మాట్లాడతారు (అర్ధం కాకపోతే మీరు అదృష్టవంతులు, అలాంటి పరిస్థితి మీకెప్పుడు రాలేదనమాట!!). అది సరే, లోకం తడిసేలా ఏడవటం ఏంటి??  నా చిన్న బుర్రకు తట్టింది ఏంటంటే? నువ్వు బాధపడుతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని కుడా బాదపెట్టకు అని. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నా గదిలో ఉండే అద్దానికే గనుక నోరు ఉంటే, రోజూ ఉదయాన్నే నా ముఖం చూపిస్తున్నందుకు నన్ను బండ బూతులు తిడుతుందేమో అని. అలాంటి అద్దమే భయపడేలా ఏడవటం ఎందుకని శాస్త్రిగారు ఎంత బాగా అడిగారు?

 "ఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటె కష్టం పొతుందా?? కదా!! మరెందుకు గోల??
ఆయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా..వృధా ప్రయాస పడాల"
నిజమే బాధల్లో ఉంటే, ఉచితంగా వచ్చేది ఏడుపే. అలా ఏడవకు అని చెప్పటం సులభం. ఏడవకుండా ఉండటం కష్టమే. కానీ ఏడవటం వల్ల ప్రయోజనం లేదు అని మన మనస్సుకి ఒకటికి పదిసార్లు చెప్పుకో గలిగితే మనలో మార్పు రావటం మాత్రం తధ్యం. నేను కొంతమందిని చూశాను, ఎన్నో కష్టాలు ఉన్నా, పైకి ఎప్పుడూ చక్కగా, చెదరని చిరునవ్వుతో ఉంటారు. బహుశా అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం కాబోలు.

"ఎండలను దండిస్తామా.. వానలను నిందిస్తామా, చలినెటో తరమేస్తామా చి... పొమ్మని....."
ఈ వాఖ్యం మాత్రం అధ్బుతం. ముఖ్యంగా చివర్లో ఛి పొమ్మని అనే చోట నాకు ఎంత బాగా నచ్చిందో, ఒకటికి వంద సార్లు విన్నాను.

"సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచి పెడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం"
 ఇలాంటి వాళ్ళను మాత్రం రోజు చూస్తూనే ఉంటాము. మిగితా మనుషులతో కలవకపోగా, మిగితా వాళ్ళు మనుషులే కానట్టు వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని నేను ఇంజనీరింగ్ చదివేప్పుడు చూశాను. తరగతిలో అందరూ మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాత్రం, "మేము రాము" అని భీష్మించుకు కూర్చునేవాళ్ళు. పైన పాటలో చెప్పినట్టు చివరకి వాళ్ళు ఏమి సాదించారు?? పెళ్లై మొగుళ్ళను సాదిస్తున్నారు.

"చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా..పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖ శాంతులు"

కొంతమంది ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ముఖం పెడుతుంటారు, ప్రపంచంలో కష్టాలన్నీ తమకే ఉనట్టు. నవ్వుతూ పలకరించినా, తిరిగి నవ్వుతూ పలకరించలేని వాళ్ళు నాకు రోజూ కనపడుతూనే ఉంటారు. మన కిరణ్ కుమార్ రెడ్డిగారిని చూడండి, ప్రపంచంలో ఆయనకి ఉన్నన్ని కష్టాలు ఇంకెవరికైనా ఉన్నాయా?? అయినా ఎప్పుడూ కూడగా నవ్వుతూ ఉంటారు.

నవ్వుతూ ఉంటే ఎక్కువ రోజులు బ్రతుకుతారని వైద్యులు కూడా నిర్దారించారు. నాకు చిన్నప్పుడు ఎవరో చెప్పారు, పుట్టిన రోజున అందంగా ఎందుకు ఉంటారంటే,  ఆ రోజు అంతా మనకు శుభాకాంక్షలు చెప్తూ, మనం నవ్వుతూ ఆ శుభాకాంక్షలను అందుకుంటాం కనుక ఆ రోజు, మిగితా రోజులకన్నా అందంగా ఉంటామాట!!!

అసందర్భం అయినా ఒక విషయం చెప్పాలి, ప్రపంచంలో ఇబ్బంది కరమైన పరిస్తితి ఏంటంటే, జోకు వేసినప్పుడు, ఎదుటి వాళ్ళు నవ్వకపోతే, ఆ బాద వర్ణనాతీతం, తల కొట్టేసినట్టు అయిపోతుంది. అది ఎంత భాదో రోజుకి కనీసం ఒకసారి అయినా అనుభవిస్తున్న నాకు తెలుసు.

ముఖం పుస్తకంలో మనం చూస్తూ ఉంటాము, "సమస్య తీరేది అయితే, దాని గురించి బాద పడాల్సిన పని లేదు. సమస్య తీరనిది అయితే బాదపడిన ప్రయోజనం లేదు" అని. ఇంత చక్కటి పాట రాసినందుకు శాస్త్రిగారికి, పాడినందుకు శ్రీరామచంద్రకు, పాడించిన మిక్కి కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.