Friday, June 24, 2011

చిరంజీవి, చితికిన వేలు

అద్దంకికి ఈశాన్యం దిశగా ఒక చిన్న గ్రామం. పేరు కశ్యాపురం. అది మా స్వగ్రామం. నా బాల్యంలో ఒక అధ్యాయం అక్కడే జరిగింది. సెలవ రోజులన్నీ ఆహ్లాదకరంగా గడిచి పోయేవి. అక్కడ జరిగిన ఎన్నో చిన్న చిన్న సంఘటనలు, నా మీద చెరగని ముద్ర వేశాయి.

మా ఇంటి ముందు ఒక బాదం చెట్టు, వెనక ఒక బాదం చెట్టు ఉండేవి. ముందు ఉన్న చెట్టుకి పచ్చని కాయలు, వెనక ఉన్న చెట్టుకి ఎర్రని కాయలు కాసేవి, రెండూ రుచిగా ఉండేవి. ఇంటి వెనుక బావి. ఇరుకు ఇరుకు గదుల్లో కన్నా, బావి దగ్గర స్నానం..., ఆహా!!!! ఆ హాయేవేరు. ఇంకా ఇంటి వెనకాల పొలం, ఆ పొలం గట్ల మీద ఉదయాన్నే విహాయర యాత్రకు వెళ్ళడం(దానినే ముద్దుగా లండన్ అని కూడా అనొచ్చు :P) మర్చిపోలేని అనుభూతి.

మా ఊరి చివర ఒక పెద్ద చెరువు, దాని ఒడ్డున పెద్ద మర్రి చెట్టు, దాని నిండా తేనె తెట్టెలు, ఆ చెట్టుకి కొంచెం దూరంలో ఒక చిన్న ప్రభుత్వ పాఠశాల. దాని ముందు రెండు చింత చెట్లు, మంచినీటి కోసం వేసిన చేతి గొట్టం(ఆంగ్లంలో బోరింగ్) ఉంది. ఊరంతటికి అదే ఆధారం. సెలవలు అన్నీ అక్కడే ఆటపాటలతో గడిచిపోయేవి. "ఇప్పుడు నీ బాల్యం గురించి తెలుసుకొవటానికి నువ్వేమైనా మహాత్మా గాంధీవా లేక మైనంపాటి శ్రీరామచంద్రవా?" అనే కాదా మీ అనుమానం. సరె, ఇక అసలు విషయానికి వద్దాం.

మా అక్కలిద్దరికి నేనంటే ఎంతో ప్రేమ. మా పెదనాన్నగారికి ఇద్దరూ అడ్డపిల్లలు అవ్వటం చేత, నేనంటే కాస్త గారాబం ఎక్కువ. అలా సెలవలు జరుగుతూ ఉండగా ఉండగా, ఒక సాయంత్రం, మా అక్కలిద్దరూ నన్ను తీసుకొని మంచి నీళ్ల కోసమని అక్కడకి వచ్చారు. ఆటలలో ఉండగా, ఎవడో చలన చిత్రాల ప్రస్తావన తీసుకు వచ్చాడు. చిన్నతనం కదా, "నేను చిరంజీవి అభిమానిని నాకేమి కాదు, మీరంతా ఎదవలు" అని ఏదో నాలుగు కూతలు కూశాను. అవతలి వాడు ఇంకా రెచ్చగొట్టాడు. నేను రెచ్చి పోయి "నేను ఏమి చేసినా తిరుగులేదు" అని ఆ చేతి గొట్టంలో ఎడమచేయి చిటికిన వేలు పెట్టాను.

వాడెవడో? నా మీద ఎందుకు అంత కోపమో? తెలియదు కానీ, మొత్తానికి నా వేలు చితగొట్టాడు. నా ఎడమచేయి చిటికిన వేలు ఆవకాయ పచ్చడి అయింది. రక్తం గుండ్లకమ్మ నది పారినట్టు పారింది. చిటికిన వేలు కాస్త చితికిన వేలు అయింది. మా అక్కలిద్దరి మోహంలో నెత్తురు చుక్క లేదు.

మా పెద్దనాన్నగారు "శ్రీ వేంకటరామయ్య" గారు మా ఊర్లో వైద్యం చేస్తుంటారు. జలుబొచ్చినా, జ్వరమొచ్చినా అన్నింటికీ ఆయనే దిక్కు. పరుగు పరుగున ఆయన దగ్గర నన్ను ప్రవేశ పెట్టారు.

ఇంతలో మా పెదనాన్న నా చేతిని శుబ్రంగా కడిగి, కట్టు కట్టాడు. అయినా నా ఏడుపులోని శృతి ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడు మా పెదనాన్న" ఆఫ్ట్రాల్ ఏలు విరిగితే ఏడుస్తారా ఎక్కడైనా? అద్దంకి వాళ్ళు వేలే కాదు, ఏది విరిగిన ఏడవకూడదు రా" అని నా చేత ఏడుపు ఆపించటానికి తెగ ప్రయత్నించాడు.

వేలికి కట్టుతో నన్ను చూసేసరికి ఇంట్లో అంతా కంగారు పడ్డారు . నా వీరగాధని అందరికి విన్నవించిన పిదప నొప్పి భరించలేక, మళ్లీ ఏడుపు మొదలు పెట్టా. నా ఏడుపు ఆపటానికి, నాకు ఇష్టం అయిన వేరుశనగ ముద్దలు, కొబ్బరుండలు ఇలా ఏది అడిగితె అది కొని ఇచ్చారు. పాపం నన్ను తీసుకెళ్ళి అజాగ్రత్తగా ఉన్నందుకు మా ఆమ్మ, మా ఆక్కలిద్దరినీ ఘనంగా సన్మానించింది. ఆ సన్మానానికి వాళ్ళిద్దరూ ఏడ్చిన ఏడ్పులో నేను ఏడ్చినది పదో వొంతు మాత్రమే అంటే అర్ధం చేసుకోండి, వాళ్ళను ఎంత బాగా ఉతికి ఆరేసిందో.

ఇదండీ నా చిటికిన వేలి, చితికిన గాధ. "చిరంజీవి, చితికిన వేలు" అనే కధ, కశ్యాపురం చేరింది. మనం మన పనుల్లోకి వెళ్దాం .

Friday, June 17, 2011

పండిత పుత్రః పరమ ..............


1) " మా తాతగారు రోజుల్లో ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అలాంటి తాతగారి మనుమడిగా పుట్టటం నా పూర్వ జన్మ అదృష్టం." ఇలాంటివి మనం వింటూనే ఉంటాము. గమనిస్తే ఇప్పుడున్న కధానాయకులలో మూడొంతులు సినీ నేపధ్యం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన వారే. ఒక కధానాయకుడి కొడుకు కూడా కధానాయకుడు అవుతున్నాడు.

2) "నాన్నగారు నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు, " మాటలు కూడా మనం వింటూనే ఉంటాం. మీరెప్పుడు వినకపోతే సాక్షి టీవి చూడండి. రాజకీయనాయకుని కొడుకు కుడా రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నాడు.ఇలానే ఒక వ్యాపారి కొడుకు, వ్యాపారి అవుతున్నాడు, వారి వారి రంగాలలో తండ్రికి తగ్గ తనయుల్లాగా దూసుకుపోతున్నారు. కాని ఒక ఉపాధ్యాయుడి కొడుకు మాత్రం ఉపాధ్యాయుడు కావటంలేదు. ఎందుకబ్బా???

"పండిత పుత్రః పరమ సుంఠః " సామెత నిజం అంటారా?? అంటే పండితుల కొడుకులందరూ......?????

నాకు తెలిసి మా నాన్న గారు పండితుడు. అంటే నేను........???

నాకు అప్పుడప్పుడు ఇలాంటి అనుమానాలే వస్తూ ఉంటాయి. కంగారు పడకండి.


సింగ్ లేదా సర్దార్ల మీద మనకు అప్పుడప్పుడు తమాషా సందేశాలు వస్తూ ఉంటాయి. మా స్నేహితుడు ఒకతను అంటాడూ, "సర్దార్లని ఎగతాళి చేయటం సులభమే, కానీ ఒక సర్దార్ లాగా బ్రతకటం కష్టం అని" నిజామే కదా., కాని నేనేమంటానంటే "ఒక ఉపాధ్యాయుడిగా బ్రతకడం సులభం, కాని ఉపాధ్యాయుడి కొడుకుగా బతకటం కష్టం". వీడింతే, శీర్షిక రాయటం మొదలు పెడితే వాడేమి రాస్తాడో వాడికే తెలియదు అని తిట్టుకోకండి. మా(పండిత పుత్రులు) కష్టాలు ఎన్నని చెప్పమంటారు. పాతికేళ్ళ అనుభవంతో రామానంద స్వామి(నేనే) చెప్పేది ఏంటంటే...................


"ఫలానా రావు మాస్టారు గారి అబ్బాయికి పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? ", "మాస్టారు గారి అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ ఎంత?" ఇలాంటివన్నీ చాలా సహజంగా వచ్చే ప్రశ్నలు, కానీ జవాబులే చికాకుగా ఉంటాయి. తరగతిలో పాతిక మంది పరీక్షలో తప్పినా పట్టించుకోరు కానీ., పంతులుగారి అబ్బాయికి ఒక్క పరీక్షలో తక్కువ శ్రేణి వచ్చినా అదొక పెద్ద దూమారం అవుతుంది, మామిడి టెంకలో చెప్పినట్లు. బడిలో గంట పాఠం వింటేనే బుర్ర తిరిగిపోతుంది., పది నిముషాలు పంతులుగారు తిడితేనే  తల బొప్పి కడుతుంది. అలాంటిది 24 గంటలూ ఇంట్లో కూడా తిట్లు వినటం ఇంకా ఎంత నరకమో, అనుభవిస్తే తప్ప, చెబితే అర్ధం అయ్యేది తక్కువే.



చదువు గురించి ప్రక్క పెడదాం. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. చాలా మంచోడు. రోజుకి పెట్టె కన్నా దూమపానం చేయడు. కానీ అగ్గిపుల్ల వెలిగించటం కూడా ప్రక్కన వాళ్ళకి తెలియకుండా చేస్తాడు. దూమపానం చేస్తున్నంతసేపు ఎవరైనా చూస్తారేమో అన్న భయం. "ఎందుకు రా అంత భయం?" అని అడిగితే, " మా నాన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తారు. ఫలానా పంతులుగారి అబ్బాయి ధూమపానం చేస్తున్నాడు అని అంటే బాగోదు" అని బాధను వ్యక్తం చేశాడు. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలకు దూరం ఐన ఎదవని చూస్తె బొమ్మరిల్లు చిత్రంలో కధానాయకుడు సిద్దార్ధ్ గుర్తొచ్చాడు. "అంత బయపడుతూ తాగకపోతే మానేయరా" అని చెప్పా. మాటకు వాడి మనోభావాలు దెబ్బ తినట్టు ఉన్నాయి., రెండంటే రెండు బూతులు తిట్టాడు. ఇలాంటి కష్టాలు అనుభవించిన అందరికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.


పంతులుగారి అబ్బాయి అంటే, ఎప్పుడూ మొదటి శ్రేణిలో ఉండాలా? పండిత పుత్రులు మాత్రం మనుషులు కారా? వాళ్ళకి మాత్రం మనసు ఉండదా??? "చెట్టు మంచిది ఐతే కాయ మంచిది అవుతుంది" మాట నూటికి నూరుపాళ్లు నిజం. కాకపోతే మామిడి చెట్టుకు మామిడి కాయలు కాస్తాయి కానీ, జామ కాయలు కాయవు కదా. అర్ధం కాలేదా? పంతులుగారి అబ్బాయి అయినంత మాత్రాన వందకు వంద రావాలని ఏమీ లేదు. చెప్పిన పాఠం చెప్పినట్టు బట్టీ వేస్తే కుక్కకి కూడా వంద వస్తాయి. బాగా చదివితే, మాహా ఐతే ఒక s/w ఇంజనీర్ అవుతాడు. కానీ ఇంకో నలుగురు ఇంజనీర్లని తయారు చేయలేడు. నలుగురికీ ఆదర్శ ప్రాయంగా బ్రతికి, నలుగురిని మంచి మార్గంలో నడిపించగలిగితే, అప్పుడే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు. అలా చేసిన రోజున అందరూ "పండిత పుత్రః పరమ పూజ్యః" అని అంటారు

గమనిక: ఇవన్నీ కేవలం నా అనుభవాలు మాత్రం కాదు. మా నాన్న ఉపాధ్యాయుడు అయినప్పటికినీ, నన్ను రుద్దింది ఒక్కింత తక్కువే. నా మిత్రుల కష్టాలు విని, కొన్నిటిని స్వయంగా చూచి రాసిన శీర్షిక. లేదంటే,మా నాన్న ఇదంతా చదివితే, బాధ పడే అవకాశం ఉంది. :P  (నాకు అబద్ధాలు ఆడటం రాదు)