Sunday, October 12, 2014

అద్దంకి నుండి అమెరికా దాక

అద్దంకి నుండి చాలా మలుపులు తిరిగి, మొత్తానికి  అమెరికా చేరాను. ప్రస్తుతానికి ఓ మాదిరిగా ఉంది.. చూడాలి అమెరికా ఎలాంటి మనుషులని కలుపుతుందో???? ఎలాంటి పాఠాలు నేర్పుతుందో... ఇక విషయానికి వస్తే... 

ఇండియాలో అయినా, ఇక్కడ అయినా ఇళయరాజాని మాత్రం వదిలేది లేదాయే.... విమానంలో కూర్చొని, ఆకాశంలో ఎగురుతుంటే, నాకు నేనే రాజును అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో, ఈ పాట నా ఫోనులో వినపడింది. వెంటనే ఆ విమానంలోనే, ఆ పాటను కంపు చేసే కార్యక్రమం జరిగిపోయింది. కంప్యూటర్ లేక, ఉన్నా రాయటానికి ఖాళీ లేక, ఇదిగో ఇప్పటికి కుదిరింది.  


రాజాది రాజాను నేనురా!!! ఇక US వైభోగం చూడరా!!!
సాఫ్ట్ వేర్ సామ్రాట్ నేనురా!!! ఇక సన్నివేలు SFO నాదిరా!!!
Onsite ఏ నేను పట్టేశా... ఆకాశం అంచు తాకేశా 
గూగుల్ నే గుల్ల చేసేస్తా... బిల్ గేట్స్ నే నేను దాటేస్తా   ॥ రాజాది ॥ 

వెండి పేజి, గోల్డెన్ పెన్ తో బ్లాగు నేను రాస్తానురా
ఎవరు నువ్వని నన్నడుగుతుంటే, N.R.I  అని చెప్తానురా 
బారక్ ఒబామాను కలిసి, భళా భాగవతం భహుమతిస్తా 
తేనెలూరు తెలుగు నేర్పి, ఆవకాయ రుచి చూపిస్తా 
దీప్తి లేదు గనుక, ఆడింది ఆట ఇంక 
సీత వచ్చే దాక, నాకేది ఎదురు ఇంక 
      అమెరికా వీధులన్ని, ఆణువణువూ తిరిగేస్తా ॥ రాజాది ॥ 

వీకు ఎండు ఆ వైటు హౌసు, చుట్టి వచ్చా నే చిటికెలో 
As it Is ఇట్టాంటిదొకటి, కట్టించాలి మా ఊరిలో 
స్పీల్ బర్గ్ ని ఒప్పించి.., Tollywood కి రప్పిస్తా 
ఎర్ర తోలు పిల్ల వస్తే.., నాకు పెళ్లైందని పంపేస్తా 
రోజు తింటా రోఠి, నాకెవరు లేరు సాఠి 
పెట్టుకోను పోటి, నేను ఎవరి తోటి 
                               అద్దంకి వీధుల్లో, Hitech city కట్టిస్తా ॥ రాజాది ॥                               

అమెరికా నుండి రాస్తున్న మొట్ట మొదటి టపా!!!!!

Thursday, August 7, 2014

అతడు... రాముడు... 2014

ఒక సరదా సన్నివేశం... అతడు సినిమాని "మా" లో మళ్ళీ చూసిన ఆనందంలో వ్రాస్తున్న టపా......  
----------------------------------------------------------------------------------------------------------

సత్యన్నారాయణ మూర్తి : రాముడు .... ఏమిటిది???
నేను : టపా .... ఇంగ్లీషులో పోస్టు అంటారు అని, మా ఆవిడ గారు ఇప్పుడే చెబుతున్నారు , నువ్వు అడిగావు. 
సత్యన్నారాయణ మూర్తి :   తెలివిగా రాయద్దు రాముడు 
నేను : చూశావా!!! బ్లాగు రాయకపోతే బద్దకం అంటారు... కష్టపడి రాస్తే, పని పాటా లేదంటారు...  మరి నన్ను ఏమి చేయమంటారు???
సత్యన్నారాయణ మూర్తి :  ఈ బ్లాగులు అన్నీ ఆపేసి, ఆ నవలలు ఏవో రాసుకో .........
సత్యన్నారాయణ మూర్తి: (మా ఆవిడతో) :  దీప్తీ గారు, అడ్డమైన చెత్తంతా వీడు బ్లాగుల్లో రాస్తూ ఉంటాడని మీకు తెలుసు.... ఇలాంటి రాతలను ఆపకపోయినా పర్వాలేదు కానీ, ఇలా దగ్గరుండి రాయించటం మాత్రం, మీకు ఆరోగ్యం అనిపించుకోదు. 
దీప్తి : చూడండి... ఈ బ్లాగులు చదవటం ఎందుకు అని మీకు అనిపించింది అనుకోండి... మీ ఆరోగ్యానికి మంచిది. ఇలా వచ్చి గొడవ చేస్తే... మీ మీద కూడా ఒక బ్లాగు రాస్తాడు... ఛీ... రాముడు లాంటి రచయితతో మనకేంటి అని వదిలేశారనుకోండి, బోలెడు Time Save అవుతుంది. 
నేను : అదండి సంగతి,  అలా జరిగింది. కాబట్టి నేను రాయటం ఆపను
సత్యన్నారాయణ మూర్తి : రాముడు.... ఇప్పుడే వెళ్ళి ఇంకో నలుగురుని తీసుకొని వచ్చి, నీ చేత రాయటం ఆపిస్తాను.

రమణ : ఏంటి పార్ధు.. ఏమన్నా గొడవ??
పార్ధు : పెళ్ళి అయినా, రాముడు రాయటం ఆపలేదు
రమణ : తోచక రాస్తూ ఉన్నాడేమో..., ఆపేయమని చెబుదాములే...
పార్ధు : వెళ్ళి ఒకసారి చెప్పి వస్తా
రమణ : ఎందుకూ.....
గిరి : మాట్లాడటానికే కదరా, వెళ్ళనీ
రమణ : వీడిప్పుడు రాముడితో మాట్లాడటం నాకు ఇష్టం లేదురా!!!
గిరి : ఏ వాడేమైనా పెద్ద తోపు రచయితా??

పార్ధు : అనంతరామయ్య, నువ్వు చేసేది తప్పయ్యా..... 
నేను : తెలుసయ్య కానీ మానలేక పోతున్నా, ఏమి చేయమంటావు? పెళ్ళికి పూర్వం రెండు, మూడు పోస్ట్ లు రాసే వాడిని, ఇప్పడు బాగా తగ్గించా.... 
పార్ధు : నేను మాట్లాడేది బ్లాగుల గురించి కాదు...
నేను : కొంపదీసి నవలల గురించా?  చూడు బాబు, నేను ఇప్పటికి వందకు పైగా టపాలు రాశాను, మూడు నవలలు రాశాను. త్వరలో ఇంకొక నవల అయిపోతున్నది..., అది చదివాక Automatic గా నీకు గుండెపోటు వస్తుంది.., కాబట్టి కంప్యూటర్ కాడ రెడీగా ఉండు... వెళ్ళు
రమణ : పార్ధు... కంపుతో కబడ్డీ ఆడుతున్నావు నువ్వు...
పార్ధు : దీప్తీ గారు.., మీరన్నా చెప్పండి, ఈ రాతలు ఆపమని
దీప్తి : According to his mentality.., he doesn't stop writing, you know!!!
పార్ధు : అంటే ఈ విషయంలో మీరు ఏమీ చేయలేరా??? ఏమీ చేయలేరా??? ఖర్మ... చదవక తప్పుతుందా!!!

అర్ధం కాని వాళ్ళు ఈ వీడియో చూడగలరు 
చివరగా ఒక ప్రశ్న... అతడు సినిమా "మా" టీవీలో ఇప్పటి వరకు ఎన్ని సార్లు ప్రసారం చేసి ఉంటారు??? ఎన్ని సార్లు చూసినా, ఇంకా చూడాలీ అనిపిస్తుంది... 

Saturday, May 10, 2014

అమ్మవారి సాక్షిగా, నా ఆస్తిని పంచుకున్నారు

క్రొత్తగా పెళ్ళైతే చేసే మొదటి పని .... గుళ్లని, పుణ్య క్షేత్రాలని దర్శించటం. అందులో భాగంగానే, పెళ్లి అయిన మూడో రోజు, సతీ సమేతంగా విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లాను. ఏమి అదృష్టమో తెలియదు, వెళ్ళిన ప్రతి సారీ, అమ్మ వారి దర్శనం నిముషాలలో దొరుకుతుంది. ఈ సారి కూడా అలానే 100/- టికెట్టుతో పావు గంటలో దర్శనం చక్కగా అయ్యింది. భవ సాగరాన్ని బాగా ఈదేలా చూడమని అమ్మని వేడుకున్నాను. జనం కూడా పెద్దగా లేకపోవటంతో ప్రశాంతంగా బయటకి వచ్చాను. ప్రశాంతతను కోల్పోయాను.

అమ్మవారి దర్శనం అవ్వగానే... స్వామి వారి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయ్యాక, పెద్ద పెద్ద విభూతి బొట్టు పెట్టుకున్న పంతులుగారు అడిగారు, "క్రొత్తగా పెళ్లి అయ్యిందా?" అని. అవునన్నాను. ఆ మాటకు ఆయన కళ్ళల్లో అమితమైన ఆనందాన్ని గమనించాను. నాకు పెళ్లి అయితే ఇతనికేంటా అంత ఆనందం అని అనుమానం వచ్చింది. నా నుదుటున, రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టి, పేరు, గోత్రం అడిగి మంత్రాలు చదవటం మొదలు పెట్టాడు. ఒక నిముషం చదివి, ఒక అయిదు వందల నోటు తీసి... నీకు పిల్లలు పుట్టాలని పది మందికి భోజనాలు సమర్పించు అన్నాడు. నాకు ఏమీ అర్ధం కాలేదు. నా పేరు మీద అతనే 500 తీశాడేమో అనుకున్నా. ఒక 500 ఇవ్వు అనట్టు సైగ చేసాడు. నేను ఇచ్చాను అనటం కన్నా, అతను లాక్కున్నాడు అంటే బాగుంటుంది. తీర్ధం తీసుకొని బయటకు వచ్చాను.

అమ్మవారు, అయ్యవార్ల దర్శనం అయిపోయింది కదా అని వచ్చిన దారిలోనే బయటకి వెళ్లబోయాను. మధ్యలో ఒకామె నిలబడి.. అటు వైపు ఇంకా గుళ్ళు ఉన్నాయి, అటు నుండి వెళ్ళాలి అన్నది. అక్కడ వరుసగా నాలుగు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. మొదట వినాయక మందిరంలో పూజారిగారు  , అవే ప్రశ్నలు అడిగారు. తీర్ధం ఇచ్చాక ఒక వంద నోటు తీసి నాకు చూపించి, ఇందాక గుళ్ళో చెప్పినట్టే చెప్పి వంద లాకున్నాడు. ఇలా మిగితా మందిరాలలో కూడా వంద కాగితం చూపించటం, నా దగ్గర వంద లాగటం జరిగింది.

ఆ నాలుగు ముగించుకొని బయటకు వచ్చాక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందన్నారు. అక్కడ పంతులుగారికి కాసిన్ని ఎక్కువ మంత్రాలు వచ్చులాగుంది... ఎక్కువ సేపు చదివి, 500 నోటు బయటకు తీసి, నన్ను ఒక 500 ఇవ్వమన్నట్టు సైగ చేశాడు. నా జేబులో చూస్తే వంద కాగితం మాత్రమే ఉన్నది. చేసేది లేక, నా దగ్గర ఉన్న ఆఖరి వంద కాగితం కూడా పళ్ళెం లో పెట్టి ఇచ్చాను. "నేను 500 అడిగితే, 100 కాగితం ఇస్తావా? నాకు గిట్టుబాటు కాదు. నీ లాంటి వాళ్ళు గుళ్ళకు ఎందుకు వస్తారో?" అన్నట్టు నా వైపు, నీచంగా చూశాడు. చేసేది లేక తల దించుకొని బయటకు వచ్చాను. ఆ విధంగా పంతుళ్ళందరూ కలిసి అమ్మవారి సాక్షిగా, నా ఆస్తిని పంచుకున్నారు.

నాకు మొదలే గుళ్లకు వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా చిరాకు. ఇలాంటి సంఘటనలు చూసి ఆ చిరాకు పదింతలు అవుతున్నది. దోచుకోవటం అంటే మరీ ఇలానా??? దీనికి పరిష్కారం లేదా???